రాజకీయంగా వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని,తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణనమని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి రావటానికి చెప్పేదొకటి, వచ్చాక చేసేదొకటని, విశ్వసనీయత లేని వ్యక్తి జగన్ రెడ్డి అని 57 నెలల పాలనలో ప్రజలకు స్పష్టమైందని తెలిపారు.ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మకద్రోహం చేశారన్నారు.ఎత్తుకొని పెంచిన చిన్నాన్నను కిరాతకంగా హత్యచేసిన నేరస్థుల్ని కాపాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన, కడప ప్రజల కోరిక అయిన కడప స్టీల్ ప్లాంట్ పై నిర్లక్ష్యం వహిస్తున్నారని, అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచారన్నారు.
కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశారన్నారు. అధికారం వచ్చిన తరువాత తల్లి,చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి అని తెలిపారు. తండ్రికి ‘ఆత్మ’గా పేరుబడ్డ కేవీపీ రామచంద్రరావు, నీడగా ఉన్న సూర్యుడు నేడు జగన్మోహన్ రెడ్డి వెంట ఎందుకు లేరని ప్రశ్నించారు.నమ్మిన ఎమ్మెల్యేలకు ద్రోహం చేశారని వెల్లడించారు.నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీలకు ద్రోహం చేసి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలను,ఇతర విధులను నిర్వర్తించిన వాలంటీర్లను మోసం చేశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీపై ఉద్యోగుల్ని మోసం చేశారని తెలిపారు.
మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని నమ్మబలికి మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.నాసిరకం మద్యం పంపిణీ చేస్తూ మహిళల మాంగల్యాలు తెంచుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చబోనని, ఇల్లు కూడా రాజధాని ప్రాంతంలో కట్టుకున్నానని నమ్మించి రాష్ట్ర ప్రజలను,అమరావతి రైతులను మోసం చేశారని పేర్కొన్నారు.రైతు భరోసా కింద మే నెలలోనే ఒకేసారి రూ.12,500 ఇస్తామని చెప్పి.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ కింద ఇచ్చే నగదను తను ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని తెలిపారు.విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల విద్యుత్ భారాలు మోపి కరెంట్ కోతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించి,120 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు.14 లక్షల ఎకరాల అసైన్ మెంట్ భూములు కబ్జా చేశారు. బ్యాక్ లాగ్ పోస్టులు 1.40 లక్షలు భర్తీ చేయకుండా సామాజిక న్యాయం గొంతు కోశారన్నారు.ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తామని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారన్నారు.సీబీఐ జగన్ రెడ్డిపై నమోదు చేసిన 11 ఛార్జిషీట్లలో తన సహ నిందితుడిగా మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. అలాంటి మోపిదేవిని రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ గా తప్పించి నమ్మకద్రోహానికి పాల్పడ్డరన్నారు.రాజధాని అమరావతిపై కేసులు వేయడంతో పాటు.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్థుడిగా, అనుచరుడిగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలోనూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు అని వెల్లడించారు. చివరకు ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా కోల్పోయిన నీకు విశ్వసనీయత లేదు,అందుకే జగన్మోహన్ రెడ్డిని జనం “నమ్మక ద్రోహి” అంటున్నారని ఎద్దేవా చేశారు.