జిల్లాల మార్పు తర్వాత కోనసీమలో జరిగిన అల్లర్లు అక్కడ రాజకీయంగా ఎలాంటి మార్పులు తీసుకువచ్చాయి ఏ పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టం కలిగించబోతున్నాయి..? ఏ పార్టీకి లాభంగా మారుతున్నాయి అన్న లెక్కలు ఇప్పుడు తారుమారవుతున్నాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దంటూ అప్పట్లో అల్లర్లు చెలరేగి ఏకంగా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి మీద దాడి జరగడం మొత్తం ఇంటిని దహనం చేయడం జాతీయ స్థాయిలో సంచలమైంది. అప్పట్లోనే దీనిపై జనసేన వైసీపీ రెండు పార్టీల నాయకులు మీరంటే మీరు అంటూ ఒకరి మీద ఒకరు నెపం తోసుకునే ప్రయత్నం చేశారు. చివరకు సుమారు 32 మంది నిందితులను అరెస్టు చేయడం, ఇటీవల వారి మీద ఉన్న కేసులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం కోనసీమ జిల్లాలో రాజకీయంగాను మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.
జనసేన పై నెపం తోసే యత్నం
ఉభయగోదావరి జిల్లాలో బలంగా కనిపిస్తున్న జనసేన పార్టీను కచ్చితంగా అక్కడ దెబ్బతీసేందుకు వైసిపి ఆడిన గేమ్ ప్లాన్ లో భాగమే కోనసీమ అల్లర్లు అనేలా జనసేన పార్టీ వేగంగా స్పందించడం విశేషం. అల్లర్లు జరిగిన వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి వేగంగా స్పందించడంతో చాలావరకు దీని నుంచి జనసేన పార్టీ బయటపడినట్లు అయింది. కేసులో వెంటనే నిధులను అరెస్టు చేసి వారి జనసేన పార్టీ సానుభూతిపరులు అని చూపే నాటకాన్ని ముందే పసిగట్టిన జనసేన పార్టీ వేగంగా స్పందించడంతో పాచిక పారలేదు. ఫలితంగా కేసులో ఉన్న అసలు కోణం, నిందితులు వివరాలు కూడా ప్రభుత్వం బయట పెట్టలేదు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో దళితుల ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న దళితులను వేరుపరిచే యత్నంలో భాగంగా జిల్లాల విభజనను వైసీపీ ఉపయోగించుకోవాలని భావించింది. దీనిలో భాగమే జిల్లాల పేర్లు అన్ని మొదటి ప్రకటించి కోనసీమ జిల్లాకు మాత్రం చివర్లో బిఆర్ అంబేద్కర్ పేరును ప్రకటించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత ఓ ప్రణాళిక బద్ధంగా అల్లర్లను రేపి, దానిని జనసేన పార్టీ మీద తోసేస్తే ఉభయగోదావరి జిల్లాలో కచ్చితంగా గుంపు గుత్తుగా ఓట్లు పడతాయి అనుకుంటున్న వారిలో బలమైన చీలిక తీసుకురావచ్చు అన్నది ఈ ప్లాన్ లో ప్రధాన భాగం అన్నది రాజకీయ వర్గాల వాదన.
కేసులు ఎత్తివేయడంపై తొందర ఎందుకు?
వైసిపి పల్లా గాని జనసేన పార్టీ బలంగానే తిప్పి కొట్టిందని భావించాలి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి వేగంగా స్పందించడం పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఆ పార్టీకు ఇది పెద్ద ప్లస్ గానే మారిందని చెప్పొచ్చు. దాని తర్వాత ప్రభుత్వం ఆ కేసులో ఎవరెవరిని నిందితులుగా చేర్చింది అన్నది కూడా బయట పెట్టలేదు. దానిలో వైసీపీ సానుభూతిపరులు, నాయకుల అనుచరులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇంటిని తగలబెట్టిన అసలు నిందితులు ఎవరు అన్నది కూడా ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది. దీంతోపాటు ఇటీవల ఆ కేసుకు సంబంధించి కేసులను ప్రభుత్వం తొలగించడం ఇప్పుడు వైసీపీ కి దెబ్బ. స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని అప్పట్లో కోనసీమ అల్లర్లను రగిలించి వైసిపి లాభపడాలని ప్రయత్నించిందని ఇప్పుడు మొత్తం బండారం బయటపడేసరికి కేసులను తొలగించాలని భావిస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఇది ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో అధికార పార్టీకి కొత్త తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే వైసీపీకి ముఖ్యంగా కోనసీమ జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలోనూ తల బొప్పి కట్టడం ఖాయం.