ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలు సీట్ల భర్తీపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ భేటీ అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారాయి. టిడిపి,జనసేన పొత్తులో భాగంగా ఎవరికి సీట్లు దక్కుతాయి,ఎవరికి మొండిచెయ్యి ఉంటుందోనన్న ఇరు పార్టీల అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈరోజు అధికార వైసిపిలో ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థుల ప్రకటన సిట్టింగ్ లలో గుబులు రేపుతుంది. వారం రోజుల క్రితం వైసిపి 11 మంది ఇంఛార్జులను ప్రకటించిన వెంటనే కొన్ని స్థానాల్లో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి లో 17 స్థానాలు,పశ్చిమ గోదావరి లో 19 స్థానాల అభ్యర్థుల ప్రకటన సోమవారం రాత్రి వెలువడే అవకాశం ఉందని సమాచారం.మంత్రులు,ఎమ్మెల్యేలకు స్థాన చలనం ఉంటుందా? వేరే రాజకీయ హామీ ఉంటుందా? ఎంపి గా పోటీ చేసే అవకాశం ఇస్తారా ? అనేక అనుమానాలతో నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆరు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవన్న వార్త ఉత్కంఠ రేపుతోంది. సీట్లు దక్కే అవకాశం లేదన్న నేతలు తాడేపల్లి కి క్యూ కట్టి తమ గోడు వెళ్లబుచ్చుకునెందుకు సిఎం అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం లో ఉన్నారు.
*ఆరు సిట్టింగ్ స్థానాల పై ఉత్కంఠ
గత ఎన్నికల నుంచి వైసిపికి కంచుకోటలుగా మారిన ఉభయ గోదావరి జిల్లాలు ప్రస్తుతం టిడిపి,జనసేన పొత్తు నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై వైసిపి మల్లగుల్లాలు పడుతుంది. ఆరు,ఏడు స్థానాల్లో కచ్చితమైన మార్పు ఉంటుందని ముందస్తు ఇచ్చిన సమాచారం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గోదావరి జిల్లాల వైసిపి సమన్వయకర్తగా ఉన్న రాజంపేట ఎంపి పి.వి మిథున్ రెడ్డి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటు టికెట్ లేని అభ్యర్థులకు సిఎంతో మాట్లాడించే ప్రయత్నం చేయనున్నారు. పోలవరం,చింతలపూడి,పి.గన్నవరం,పత్తిపాడు,పిఠాపురం,జగ్గంపేట, రామచంద్రాపురం స్థానాల్లో అభ్యర్థుల మార్పు కచ్చితంగా ఉంటున్నదన వార్త ఉండనున్నదని సమాచారం. కొంత మంది ఎంపి లను ఎమ్మెల్యేలు గా భరిలోకి దింపేందుకు అధిష్ఠానం పెద్దలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, అందుకు అనగుణంగానే రాజమహేంద్రవరం ఎంపి గా ఉన్న మార్గాని భరత్ ను ఎమ్మెల్యే గా భరిలో దింపేందుకు అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది అని సమాచారం. అటు సిఎం ను కలిసేందుకు ఎమ్మెల్యేలు జోగి రమేష్,ఎలిజా,పూర్ణ చంద్ర, మద్ధాలి గిరి ,దొరబాబు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.