మూడు రాజధానుల నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించి డిసెంబర్ 17 కు నాలుగు సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులకు, కూలీలకు, రాజధాని బాధితులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తరుపున ఆయన అభినందనలు తెలిపారు. వారి పోరాటానికి సంపూర్ణ సంఫీుభావం ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని రైతులను జగన్మోహన్ రెడ్డి వీధుల పాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల తప్పుడు నిర్ణయాన్ని సరిదిద్దుకొని అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వము రాజధాని రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు, బిజెపి విద్రోహానికి వ్యతిరేకంగా ప్రజలంతా అమరావతి పోరాటానికి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.