- ఆంక్షలు లేకుండా వరి కొనుగోలు జరపాలి”
ప్రకృతి వైపరీత్యం మిచౌంగ్ తుఫాను వలన కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో వందల ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట రంగు మారి తేమ శాతం అధికంగా ఉందిని టిడిపి నాయకులు కటకం శెట్టి వెంకట ప్రభాకర్ తెలిపారు. ముఖ్యంగా కరప మండలంలో యండమూరి, కొంగోడు, భావారం, కొవ్వూరు, తదితర గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. - ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రాలు వద్ద నియమాలు పెట్టడం వలన రైతులు తీవ్ర మానసికంగా బాధపడుతున్నారు అని వాపోయారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతు నష్ట పోకుండా ప్రభుత్వము వెంటనే రంగుమారిన, తేమ శాతం అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలానే సకాలంలో వారికి సంచులు సప్లై చేసి, కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించవలసిన సొమ్మును సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యధిక నష్టం వచ్చిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చి ఆదుకోవాలని పేర్కొన్నారు. కరప మండలంలో చాలా గ్రామాల్లో రైతులు నష్టపోయారని ప్రభుత్వం మానవీయ కోణంలో వారిని ఆదుకోవాలని తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని పేర్కొన్నారు.