ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడలో సుందరయ్య భవనం నందు ఏపీ మత్స్యకారుల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారులు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం వర్కింగ్ కమిటీ సభ్యురాలు, సిహెచ్. రమణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన సముద్రం, నదులు,చెరువులపై మత్స్యకారులు హక్కు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బ్లూ ఎకానమీ, రాష్ట్రంలో 217 జీవోలు మత్స్యకారుల హక్కులు హరించే విషయాన్ని తెలియజేశాయని విమర్శించారు. మార్కెట్లో చేపల వ్యాపారం చేసుకుంటున్న మత్స్యకారులకు సదుపాయాలు కరువు అయ్యాయని తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్ వద్ద తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. మార్కెట్ లకు గేట్లు లేక, మహిళలకు బాత్రూం లేక వచ్చే కస్టమర్లు వాహనాలు నిలుపుకునే స్థలము లేక అనేక ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. చాలా మార్కెట్లో తాగేందుకు కొళాయిలు లేవని అన్నారు. నేటికీ వారికి సొసైటీలు ఏర్పాటు చేయలేదని,ఎలక్షన్ సమయంలో మాత్రమే రాజకీయ నాయకులకు మత్స్యకారులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఈ సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గౌరవ అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ, మత్స్యకారులు విడివిడిగా ఉండొద్దని ఐక్యంగా కలసి ఉంటే బలం అన్నారు. మత్స్యకారులు ఆదమరచి ఉంటే ఉనికినే కోల్పోతారని మత్స్యకారుల పట్ల ప్రభుత్వాలు దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని వాటిని తిప్పి కొట్టడానికి గొంతులన్నీ కలపాలన్నారు. ఎప్పటినుండో ఉన్న మార్కెట్లకు పోటీగా కంటైనర్ల ద్వారా పోటీ మార్కెట్లని రాష్ట్రప్రభుత్వము ఏర్పాటు చేస్తుందని దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలన్నారు. నేటికీ కొనసాగుతున్న సొసైటీలకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు కావట్లేదు అన్నారు. ఇది చాలా దుర్మార్గపు చర్యని వాపోయారు .మత్స్యకారులు అందరికీ సంఘం ఎల్లవేళలా అండగా ఉండి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడలోని అన్ని చేపల మార్కెట్లనుండి మత్స్య మహిళలు హాజరయ్యారు. ఉప్పాడ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరమ్మ, చిన్న, అప్పల నరస, లోకాలమ్మ, స్వరూప, రాజు, వీరమని ,నూకరాజు పాల్గొన్నారు. అంతకముందు సుందరయ్య భవన్, కొత్తపేట మార్కెట్, ఘాటీ మార్కెట్, పెద్ద మార్కెట్, జగన్నాధపురం చిన మార్కెట్, రమణయ్యపేట మార్కెట్, ఇంద్రపాలెం మార్కెట్స్ వద్ద సంఘం జెండాలు ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.