వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం మాట అటు ఉంచితే పార్టీ కార్యక్రమాలను సైతం ప్రభుత్వ కార్యక్రమాలు కింద మార్చి అధికార వ్యవస్థలను ఇప్పుడు వినియోగించుకోవడం చర్చినీయంశం అవుతోంది. ముఖ్యంగా వైసిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టదలిచిన మళ్లీ ఆంధ్రకు జగన్ ఎందుకు కావాలి అంటే.. కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగేలా ఆదేశాలు ఇవ్వడం చూస్తే వ్యవస్థలు ఎటు వెళుతున్నాయి ఏమిటి అన్నది అర్థం లేకుండా పోతుంది. ప్రభుత్వం అంటే జగన్ అనేలా కార్యక్రమం రూపొందించడం ఒక తప్పు అయితే ఏకంగా దానిని ప్రభుత్వ వ్యవస్థలతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని ఆదేశాలు జారీ చేయడం పెద్ద తప్పు. దీనిపై సివిల్స్ అధికారులు గానీ సీనియర్ అధికారులు కానీ ఏమాత్రం నోరు మెదపకపోవడం వైసీపీలో అధికారుల పట్ల ఎంత దారుణమైన అణిచివేతగా జరుగుతుంది అన్నది బయటపెడుతుంది.
** సివిల్స్ అధికారులు గానీ ఇతర శాఖల అధికారులు గానీ ఉద్యోగాల్లో చేరినప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని పూర్తిస్థాయిలో కార్యనిర్వాహక వ్యవస్థ విధులను రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తామని ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో సివిల్స్ అధికారులు అందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా అది ఒప్పో తప్పో అని తెలుసుకోకుండానే ఫాలో కావడం ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో వ్యవస్థలను నెట్టేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి తరహా పాలన కాదు అని రాజ్యాంగంలో ప్రత్యేకంగా చెప్పినప్పటికీ దానిని పాటించడంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో తప్పు జరుగుతోంది. మళ్లీ ఆంధ్రకు జగన్ ఎందుకు కావాలి అన్న నినాదం పూర్తిగా వైసిపి పార్టీకి సంబంధించిన కార్యక్రమం. వారి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ అధినాయకుడు జగన్ మళ్ళీ ఆంధ్రకి కావాలి అని వైసిపి కార్యకర్తలు నాయకులు నినదించడంలో తప్పులేదు. కానీ పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాన్ని పార్టీ నినాదాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం దానిని ఏకంగా ఉన్నతాధికారులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి. రాజ్యాంగం సరైన పద్ధతిలో అమలు కాని సమయంలో ఆ రాష్ట్రానికి జవాబుదారీగా ఉండే గవర్నర్ వ్యవస్థ కల్పించుకోవలసి ఉంటుంది. కచ్చితంగా రాజ్యాంగం అమలు అయ్యేలా చూసే బాధ్యత గవర్నర్ దే. దానికి అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ఖచ్చితంగా గవర్నర్ రాష్ట్రపతికి దీనిపై నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పార్టీ కార్యక్రమాన్ని ఏకంగా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టించి మరి కిందిస్థాయి సిబ్బందికి చెప్పించడం అంటే అది రాజ్యాంగబద్ధం అవునా కాదా అనేది వ్యవస్థ లు గమనించాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాలి.