రాజకీయాల్లో కొందరు అప్పటికప్పుడు హీరోలుగా మారుతారు. ఆ తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు వారి దశా దిశను కూడా మార్చివేస్తాయి. ఇది కూడా అలాంటిదే…. జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి, ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన మంత్రి అయిన ఓ జర్నలిస్టు పరిస్థితి ఇప్పుడు ఎటు వెళ్తుందో ఏమవుతుందో అన్నదంగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.
ఈనాడు నుంచి అనుకోని అవకాశం
కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబు ఈనాడులో సుమారు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టు. 2009లో ప్రజారాజ్యం పార్టీ బీట్ కు ఈనాడు ప్రతినిధిగా కురసాల కన్నబాబు ఉండేవారు. అలా పార్టీ అధినేత చిరంజీవితో దగ్గర సంబంధాలు, గతంలో ఉన్న బంధాలను, సినిమా తాలూకా అనుబంధాలను గుర్తు చేసి చిరంజీవికి బాగా దగ్గరైన వ్యక్తి. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కురసాల కన్నబాబును పోటీ చేయమని అడగడం ఆయన వెంటనే ఒప్పుకొని ఈనాడులో జర్నలిస్టుగా రాజీనామా చేసి రాజకీయంలో దిగడం జరిగిపోయాయి. అప్పటివరకు ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కొరసాల కన్నబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో ప్రజారాజ్యం తరఫున మొదటిసారి గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆయన చాలా రోజులు పాటు స్థిరంగా ఉండిపోయారు. ఏ పార్టీలో చేరకుండా 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 40,000 ఓట్లకు పైగా సాధించారు. అయితే గెలుపు సాధ్యం కాలేదు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఆహ్వానం రావడంతో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో రెండో మారు కూడా గెలిచి కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగారు. మంత్రివర్గ మార్పు చేర్పుల్లో భాగంగా కన్నబాబుకు పదవి పోయింది.
కన్నబాబు కథ ముగిసినట్లేనా?
మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కన్నబాబుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన అది తూతూ మంత్రంగానే ఆయన చేశారు. మంత్రిగా పనిచేసిన కాలంలో సొంత సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గట్టిగా మాట్లాడడం, తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి జనసేన పార్టీకి బలం పెరగడంతో పాటు సొంత క్యాడర్ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాయి. దీంతో కన్నబాబు కళ్ళు తెరిచే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సొంత సామాజిక వర్గానికి అండగా నిలబడలేదు అన్న పేరు ఆయనకు కాకినాడ రూరల్ పరిధిలో వచ్చింది. దీంతోపాటు జనసేన పార్టీ బలం పుంజుకోవడం ఆయనకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు కన్నబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా కష్టం అనే ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే కన్నబాబు రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.