ఎన్నికలవేళ ఎంత అప్రమత్తంగా ఉండాలో రేపటి నుంచి కూడా జనసేన తెలుగుదేశం పార్టీలో అంతే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రేపటి నుంచి ఎన్నికల కమిషన్ నుంచి ఓటరు జాబితా వస్తుండడంతో దానిని పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యంగా ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలి. ప్రతి కార్యకర్త తమకు తెలిసిన పరిధిలో పూర్తిస్థాయిలో పరిశీలన జరిపితే గాని అసలు విషయాలు బయటపడే అవకాశం లేదు.
** వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసిపి చాలా ఆక్రమాలకు తెర లేపింది. అతి ముఖ్యమైనది దొంగ ఓట్ల నమోదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల వరకు దొంగ ఓట్లు నమోదు అయినట్లు వివిధ మార్గాల్లో ఈ ఓట్లు నమోదు చేసినట్లు లెక్కలతో బయటకు వచ్చింది. ఏ ఏ నియోజకవర్గాల్లో అత్యంత భారీగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయి అన్న వార్తలు సైతం పత్రికల్లో వచ్చాయి. అక్టోబర్ 28వ తేదీన ఓటరు జాబితాను విడుదల చేసే అవకాశం ఉండడంతో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మళ్లీ ఇంటింటికి తిరిగి వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీరో డోర్ నెంబర్లు వన్ డోర్ నెంబర్లు అంటూ రకరకాల డోర్ నెంబర్లు వేసి భారీగా ఒక్కో నియోజకవర్గంలో వేలాది ఓట్లను నమోదు చేసిన వైసీపీ నాయకులు వాటిని చివరి క్షణంలో ఉపయోగించే అవకాశం స్పష్టంగా ఉంది. ఓటు వేసిన వారిని మళ్లీ మరోచోటకు ఓటుకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. ఏదైనా సందేహం ఉండే నియోజకవర్గం లో దొంగ ఓట్లను భారీగా నమోదు చేసి వాటిని చక్కగా వినియోగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా ఓటర్ల నమోదు పరిశీలనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో పనిలేకుండా డైరెక్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి దీనిపై ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే చాలా చోట్ల వ్యవస్థలను ఉపయోగించుకొని వైసిపి భారీగా దొంగ ఓట్లను నమోదు చేసింది అని తేలింది. ఏకంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని పలనాడులో భారీగా దొంగ ఓట్లను నమోదు చేయడం విశేషం. ఇలాంటివి చాలాచోట్ల జరిగిన నేపథ్యంలో వచ్చే ఓటర్ లిస్టును ఉపయోగించుకొని ఖచ్చితంగా ప్రత్యేకంగా సూక్ష్మ పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.