ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికలు జనసేనానికి పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఏం తేల్చుకోవాలి ఎలా తేల్చుకోవాలి అనే కీలకమైన దారిలో ఆయన ఉన్నారు. ఏ దారిలో వెళ్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఏ స్టాండ్ తీసుకోవాలి అన్నదానిమీద స్పష్టత రావడం లేదు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ దీనిమీద సీరియస్ గా దృష్టి పెట్టినప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం రాలేదు. ఫలితంగా ఆయన ఏం చేయబోతున్నారు అన్న ఉత్కంఠ ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లోనూ అటు బిజెపి నాయకుల్లోను కనిపిస్తోంది.
** జనసేన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తుంది అని దాని తాలూకా పోటీ చేసే స్థానాలను గుర్తించారు. దీనిపై పార్టీ తరఫునుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చింది. దాని తర్వాతే పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా బిజెపి అధినాయకత్వం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సహకరించాలని.. దీనికి సానుకూలంగా స్పందించాలని పవన్ కళ్యాణ్ను పెద్ద నాయకులు కోరారు. తెలంగాణలో జనసేనకు ప్రత్యేకమైన రాజకీయ బలం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమాన బలం చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు యువతలో తెలంగాణలో ఆయనకు అభిమాన బలం ఎక్కువ. దీంతో కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వెయ్యి నుంచి పదివేల ఓట్లు వరకు సాధించగల సత్తా ఉంది. ఇది కచ్చితంగా ఆయన నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిన్ కూడా ఒక్కోసారి గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదు. దీంతో బిజెపి ఆ ఓట్లను ఎలా అయినా తమ వైపు తిప్పుకోవాలి అని భావిస్తుంది. దీంతో జనసేన మద్దతును వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా తీసుకోవాలని బిజెపి అధిష్టానం నుంచి వచ్చిన సూచనలు మేరకు తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో కచ్చితంగా బలమైన స్థానాలు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బిజెపి దానికి తగినట్లుగా ముందున్న అన్ని దారులను కలుపుకోవాలి అని కోణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ నిలబెట్టకుండా బిజెపికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సాక్షాత్తు బిజెపి అధినాయకత్వం నుంచి వచ్చిన సూచన కావడంతో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కేషన్ రెడ్డి స్వయంగా పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. అయితే అంతకు ముందు రోజే జనసేన నాయకులు, కార్యకర్తలతో కీలకమైన సమావేశంలో పవన్ కళ్యాణ్ కు నాయకులు కచ్చితంగా ఈ ఎన్నికల్లో నిలబడకపోతే తెలంగాణలో ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఎన్నికల్లోను బిజెపికి మద్దతు ఇచ్చుకుంటూ పోతే జనసేన బలం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పార్టీని తెలంగాణలో బతికించుకోవాలి అంటే పోటీ చేయక తప్పదు అని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు మధ్యస్థ దారిలో పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నారు. బిజెపి కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ కోసం సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. వారి మాటను ఇప్పుడు కాదనలేక మరోవైపు తెలంగాణలో పార్టీ బతికించుకోవాలి అంటే నాయకుల మాటను పక్కన పెట్టలేక సతమతం అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఇది కీలకమైన సమయం అని చెప్పాలి.