అప్పటికప్పుడే కలిసి ఉన్నట్లు కనిపిస్తూ.. ఎప్పటికప్పుడు విడిపోతూ కనిపించే వామపక్షాలు 2024 ఎన్నికల్లో మరోసారి విడివిడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క వామపక్షాలను ప్రజలు నమ్మడం లేదని బలం దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని వామపక్ష నేతలు చెబుతున్న సమయంలో ఇటీవల రెండు వామపక్ష పార్టీలు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలని అనుకున్నయి. కొన్ని కార్యక్రమాలను ఉమ్మడిగా చేశాయి. అయితే అదంతా మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమికి సీపీఐ దగ్గర అయితే సిపిఎం పూర్తిగా దూరం జరిగి ఒంటరిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని సిపిఎం భావిస్తే సిపిఐ మాత్రం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో కలిసి వెళ్లాలని భావిస్తోంది.
** సిపిఐ తో పోలిస్తే సిపిఎం కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీలో మోడీకి మద్దతు ఇచ్చేది లేదని తగేష్ చెబితే సిపిఎం వీరితో కలిసి వచ్చేది. అయితే దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమ కోటమి తరఫున గెలిచే ఎంపీలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారని చెప్పారు. దీనిని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించకపోవడంతో పాటు పవన్ మాటలకు మద్దతు పలికేల వ్యవహరించడంతో సిపిఎం పార్టీ పూర్తిగా పక్కకు తప్పుకుంది. సిపిఎం మత పార్టీలతో కలిసే సిద్ధాంతాలకు దూరం. వామపక్షాలు సైతం మతతత్వ పార్టీలతో మేము ఎప్పటికీ కలవబోమని చెబుతుంటారు. అయితే దీనిలో భాగంగా సిపిఎం పార్టీ బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పినా దానికి సిపిఐ మాత్రం మద్దతు తెలపలేదు. దీంతోపాటు జనసేన తెలుగుదేశం పార్టీ కోటమితో ముందుకు వెళ్లేలా నాయకులు వ్యవహరిస్తున్నారు. మొదటినుంచి తెలుగుదేశం పార్టీతో చాలా దగ్గరగా ఉంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పూర్తిగా తెలుగుదేశం చెప్పినట్లే నడుచుకుంటున్నారు. సిపిఎం నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగానే మొదటి నుంచి మెలుగుతున్నారు. తాజాగా రెండు వామపక్ష పార్టీలు విడిపోవడంతో ఎవరికి వారు అయినట్లు అయింది. 1961 లోనే వామపక్ష పార్టీలు విడిపోయాయి. రాష్ట్రంలో సైతం సిపిఎం కు పుచ్చలపల్లి సుందరయ్య సిపిఐ కు చండ్రా రాజేశ్వరరావు నాయకత్వం వహించేవారు. వారిద్దరి తర్వాత అంత సమర్థంగా రెండు పార్టీలను నడిపించగల నేతలు కరువయ్యారు. కొద్దిరోజులపాటు సురవరం సుధాకర్ రెడ్డి… రాఘవులు రెండు పార్టీలను బలంగా నడిపించే బాధ్యత తీసుకున్నప్పటికీ తర్వాత వారు కూడా వయసు వల్ల సైలెంట్ కావడంతో వామపక్షం పార్టీలకు దిశా దశ లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి వామపక్ష పార్టీలు తలో దారి చూసుకోవడం వాటి భవిష్యత్తులో సైతం సూచిస్తుంది అని చెప్పాలి.