వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి బలమైన ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ మారుతాడని వైసీపీ నేతలు కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన ను అన్ని విధాలుగా దెబ్బతీయాలి అని భావించిన వైసీపీ నేతలు ఇప్పుడు అస్త్ర శాస్త్రాలలో భాగంగా పార్టీలో కీలక నేతలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను చాలా సున్నితమైన అంశాల్లో డ్యామేజ్ చేయాలని బలంగా భావించిన వైసీపీ నేతలు ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదని కేడర్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. జనసేన కార్యకర్తలు రాజకీయాలకు కొత్తవారు కావడం కాస్త ఆవేశపరులు కావడంతో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏమాత్రం గమనించకుండానే వారు నిర్ణయాలు తీసుకుంటారని దీనివల్ల జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనం అవుతుందని వైసిపి అంచనా వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు తమ వాడు అనుకున్న నేతలను తమ వైపు తిప్పుకునేలా వైసీపీ అడుగులు వేస్తుంది. పవన్ కళ్యాణ్ కోసం 300 రోజులు పైబడి పాదయాత్ర చేసిన నెల్లూరు సిటీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనుకొని పరిస్థితిలో జనసేన పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే కేతంరెడ్డి వైసీపీ కండువా వేసుకున్నారు. నిన్న మొన్నటివరకు జనసేన పార్టీ కోసం అలాగే పవన్ కళ్యాణ్ను సీఎం చేయడానికి మాత్రమే తాను పనిచేస్తానని చెప్పకుండా కేతం రెడ్డి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం జనసేన పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది. కేతం రెడ్డి మొదటి నుంచి జనసేన జెండా పట్టుకుని అహర్నిశలు తిరిగిన నాయకుడిగా జనసేన పార్టీ శ్రేణుల్లో గొప్ప ఇమేజ్ ఉంది. అలాంటి నాయకుడిని వైసీపీలోకి తీసుకోవడం ద్వారా కచ్చితంగా జనసేన పార్టీ శ్రేణుల్లో ఒక ఆత్మ ధైర్యం దెబ్బతీసే లా వైసీపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ మాకినీడు శేషు కుమారిని అలాగే రాజానగరం మాజీ ఇంచార్జ్ మేడ గురు దత్ ను కూడా లైన్ లో పెట్టిన వైసీపీ కేతం రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ఇదే పందా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేన పార్టీలో మొదటి నుంచి పని చేసిన నాయకులతో పవన్ కళ్యాణ్ ను తిట్టించి.. లేదా పార్టీలో రెండో పొజిషన్లో ఉన్న మనోహర్ ను తిట్టించడం ద్వారా ఖచ్చితంగా 2009 స్ట్రాటజీని మళ్లీ వైసీపీ అమలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
** దీంతోపాటు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల తాము పార్టీని వీడుతున్నామని చెప్పించాలి అనేది వైసిపి నేతల ప్లాన్. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు జనసేన పార్టీ నేతల్లో చాలామందికి అసహనం ఉందని, అధినాయకత్వం కావాలని తెలుగుదేశం పార్టీకి ఓ ప్లాన్ ప్రకారం మద్దతు ఇచ్చిందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలు ప్రణాళిక వేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొద్ది రోజుల్లో జనసేన నుంచి కీలకమైన నేతలకు అన్ని రకాలుగా ఆఫర్లు ఇచ్చి మరి వైసిపి కండువా వేసి.. జనసేన పార్టీ మీద పార్టీ అధినాయకత్వం మీద భయంకరమైన దాడి చేయించేందుకు వైసిపి అన్ని రకాల అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇది భవిష్యత్తులో ఏం మలుపు తిరుగుతుంది అన్నది వేచి చూడాలి.