ప్రశ్నించే వాళ్ళంతా జైల్లో ఉండాలి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న కాన్సెప్ట్. రాజకీయంగా ఆయనను ఎవరు ఎదిరించిన లేక ఆయన పాలనను ఎవరు ప్రశ్నించిన వారు బయట తిరగకూడదు అనేది జగన్ స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం. వచ్చే ఎన్నికలవేళ జగన్ చేస్తున్న ప్రయోగాలు నియంత పాలనను తలపిస్తున్నాయి అని పాత తరం రాజకీయ నాయకులు వ్యాఖ్యనిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టించి, మరికొన్ని కేసులను ఆయనపై మోపటానికి సిద్ధమవుతున్న వైసిపి సర్కారు త్వరలోనే లోకేష్ ను కూడా జైల్లోకి పంపించాలని ప్లాన్ వేస్తోంది. మరోపక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు పక్కలో బల్లెంల తయారయ్యారు అని అర్థం చేసుకున్న వైసిపి నాయకులు ఇప్పుడు ఆయనకు సైతం పూర్తిస్థాయిలో అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని అలా లేకుంటే కనీసం ఆయన యాత్రకు జనం రాకుండా చూడాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారాహి విజయ యాత్ర కృష్ణాజిల్లాలో ప్రారంభం అయిన దగ్గర్నుంచి పోలీసుల ఓవరాక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. అవనిగడ్డ బహిరంగ సభకు సుమారు మూడు కిలోమీటర్ల ముందుగానే భారీగా జనసైనికులను సభకు రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు పెడనలోనూ అదే చేశారు. పెడన సభలో తమపై దాడి జరిగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ఏదో జరగబోతోంది అని మాత్రం అర్థం అవుతుంది. అంగళ్లు లో టిడిపి అధినాయకుడు చంద్రబాబు సభ మీద దాడి చేసినట్లుగానే ఇప్పుడు వారాహి విజయసభలోను అల్లర్లు సృష్టించి పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జరగబోయే పరిణామాలు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు దీనిపై హెచ్చరిస్తే ఆ సమాచారం ఎలా తెలిసిందో చెప్పాలంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించడం విశేషం. రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు అనేవి. తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు లేదా ఒక నేరం జరుగుతుంది అని ముందుగా ప్రజాబలం ఉన్న నాయకుడు హెచ్చరిస్తే ఖచ్చితంగా దానిపై పోలీసులు మందోబస్తు ఎక్కువ చేసి సభలో అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చూడాలి. అంతా ప్రశాంతంగా జరిగితే అంతకన్నా పోలీసులకు కావాల్సింది ఏముంటుంది. గతంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన నోటి నుంచి ఎవరో తనపై దాడి చేస్తున్నారు అని చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు ఆయనే నోరు తెరిచి వారాహి సభలో అల్లరి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు అంటే పోలీసులు మరింత అప్రమత్తం కావాలి కానీ పవన్ కళ్యాణ్ ని నిందితుడిగా చేర్చి నోటీసులు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందని భావించాలి. పోలీసులు పూర్తిగా ఒకవైపు తీసుకొని మాట్లాడుతున్నారు తప్పితే నిబంధనల పరిధిలో మాత్రం మాట్లాడటం లేదు. కచ్చితంగా తన మాట వినని వారు అంతా జైల్లో ఉండాలి అని వైసిపి నేత భావిస్తే కనుక అది అతనికే పూర్తిస్థాయిలో చేటు తెస్తుంది అని మాత్రం చెప్పొచ్చు.