ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ లో ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని ప్రకటించారు. దీంతోపాటు బిజెపి కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన భావించారు. అయితే దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి తో జతకట్టి ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ బలపడం అనేది బిజెపి పెద్దల భావన. టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతేనే ప్రత్యామ్నాయంగా బిజెపి ఏపీలో బలపడుతుంది అని కేంద్ర బిజెపి పెద్దలు బలంగా భావిస్తున్నారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జైలులో పెట్టించి, మరోపక్క లోకేష్ ను సైతం మరికొద్ది రోజుల్లో జైల్లో పెట్టడానికి సిద్ధం అవుతున్న జగన్ ఇప్పుడు వెళ్తున్న ఢిల్లీ టూర్ కీలకం కాబోతుంది. కచ్చితంగా ఈ టూర్ తర్వాత రాష్ట్ర బిజెపి ఎన్నికల ప్రణాళిక బయటపడే అవకాశం ఉంది. ఎన్డీఏ పక్షంలో ఉండి ఎన్డీఏ ఇతర పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కలవడం కేంద్ర పెద్దలకు బొత్తిగా ఇష్టం లేదు. అయితే ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లి ఏం కోరబోతున్నారు ఢిల్లీ పెద్దలను కలిసి ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బిజెపి ఏ టర్న్ తీసుకోవాలి అనేది కేంద్ర పెద్దలే నిర్ణయిస్తారు. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బిజెపి ఈసారి ఒంటరిగానే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని తెలుస్తోంది. ఏ పక్షం వైపు తీసుకోకుండా న్యూట్రల్ వే లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపి సమయం కోసం వేచి చూడాలని బిజెపి కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పక్షం వైపు బీజేపీ అడుగులు వేసిన సరే అది భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని కీలకమైన సమయంలో చాలా జాగ్రత్తగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లను ఇప్పటికే కోరారు. కేంద్ర పెద్దల నుంచి జమిలీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత అసెంబ్లీని రద్దు చేయాలా లేదా అనే నిర్ణయం కూడా జగన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు వచ్చే ఎన్నికలకు సంబంధించి కేంద్ర సహకారం ఎంత మేర అవసరమో అలాంటి కొన్ని విషయాలను కూడా కేంద్ర పెద్దల ముందు జగన్ ఉంచనున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర సహకారం దాదాపు జగన్ కే అని అర్థం అవుతుంది. అయితే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది.