ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే టిడిపి తో పొత్తు కాయం చేసిన జనసేన తనదైన రీతిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. మూడు విడతల వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అక్టోబర్ ఒకటో తేదీ నిర్వహించే నాలుగో విడత వారాహి విజయ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రజల ముందుకు రానున్నారు. “వై ఎపి డస్ నాట్ నీడ్ వైయస్ జగన్” అనే నినాదంతో ప్రజల్లోకి వస్తున్నారు. ఎందుకు జగన్ ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదో కూడా ప్రజలకు వివరిస్తామని… వారిని చైతన్య పరుస్తామని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్లమనోహర్ అన్నారు. తెనాలిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏ నినాదాలు తో అయితే అధికారంలోకి వచ్చారో వాటిని పూర్తిగా మరుగున పట్టేసారంటు మండిపడ్డారు.
ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగ యువత తమ పేర్లు ఉపాధి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుంటే వారికి ఈ ప్రభుత్వం కనీసం దారి చూపలేకపోయింది అంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులను నమ్మించి నట్టేట ముంచారని.. సిపిఎస్ పరిధిలోకి వచ్చే సుమారు రెండున్నర లక్షల మంది ఉద్యోగులను మాయ మాటలతో జగన్ తన పాదయాత్రలో మోసగించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా జిపిఎస్ పేరుతో బలవంతపు స్కీం తీసుకొచ్చి ఉద్యోగుల తలపై రుద్దుతున్నారని దీనివల్ల వారికి ఉద్యోగ భద్రత భవిష్యత్తు భద్రత లేక ఉద్యోగులు అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టి అనే విషయాన్ని పక్కన పెట్టి అప్పులతో రాష్ట్ర భవిష్యత్తు లేకుండా బటన్ నొక్కుతూ కాలం గడుపుతున్న జగన్ మనకు అవసరం లేదని అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న అన్ని చట్టసభ సాక్షిగా చెప్పిన వ్యక్తి తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు ఈ మాట తప్పిన వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు 2022 జూన్ నాటికి పూర్తి చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. గడువు తేదీలకు లెక్కేలేదు అని.. విభజన చట్టంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును అటక ఎక్కించడానికి.. ఇప్పుడు తాజాగా వైసిపి ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని అన్నారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించే ఒప్పందంపై సంతకం చేసి వచ్చి ఆంధ్ర ప్రజలకు కడుపుకోత మిగిల్చిన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికల్లో ఘనంగా ప్రకటించిన వైయస్ జగన్ తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టి మద్యాన్ని ఏరులై పారించి, లక్షలాది మందిని కల్తీ మద్యానికి బలి చేసినందుకు జగన్ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్ళీ ఎందుకు వద్దు చెప్పుకోవడానికి సవాలక్ష కారణాలు కనిపిస్తాయి అన్నారు ఎన్నికలవేళ ప్రజలను అయోమయానికి గురి చేయడానికి సమాజంలో అలజడులు సృష్టించడానికి వైసిపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ విషయంపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులను సామాన్యులను సైతం పోలీసు కేసుల్లో ఇరికించి ప్రజల్లో ఒక రకమైన భయభ్రాంతులను సృష్టించడానికి వైఎస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను ఫార్వర్డ్ చేసినా పోలీస్ కేసులతో ప్రభుత్వం సామాన్యులను ఇబ్బంది పెడుతుందని ఇది ప్రభుత్వం ధమనకాండ కు నిదర్శనమని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. నాలుగో విడత వారాహి యాత్రలో అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డస్ నాట్ వైయస్ జగన్ అనే నినాదంతో ముందుకు రాబోతున్నట్లు ఆయన తెలియజేశారు.