పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటన తర్వాత అత్యంత సంబరపడింది వామపక్షాలే. బీజేపీ మాట ఎత్తకుండానే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని చెప్పడం ద్వారా కచ్చితంగా వామపక్షాలు ఈ జట్టులో చేరేందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మొదటి నుంచి వామపక్షాలు చెబుతున్నట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేయడంతో ఆ పార్టీలకు ఎక్కడ లేని ఆనందం తన్నుకొస్తోంది. అయితే ఢిల్లీ బిజెపి పెద్దలు పవన్ కళ్యాణ్ తో ఏం చెబుతారు అన్న అంశం మీద ఇప్పుడు వాము పక్ష నాయకులు దృష్టి సారించారు.
** పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వామపక్షాలకు కొత్త కాదు. 2019 ఎన్నికల్లోను పవన్ కళ్యాణ్ తోనే వెళ్లిన వామపక్షాలు ఆ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అయితే దాని తర్వాత బిజెపితో జత కట్టిన పవన్ కళ్యాణ్ వైఖరిని మొదటి నుంచి వామపక్షాలు తప్పుపట్టాయి. సిద్ధాంతాలను అనుసరించి బిజెపితో కలిసి వెళ్లే అవకాశం లేకపోవడంతో వామపక్షాలు కచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్నిసార్లు బురద జల్లాయి. అయితే తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని బిజెపి కూడా కలిసి వస్తుందని భావిస్తున్నామని ప్రకటన చేశారు. దీంతో జనసేన టిడిపి కోటంలోకి వామపక్షాలు కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలను బట్టి వాము పక్షాల నిర్ణయం ఉండే అవకాశం ఉంది. కేంద్ర బిజెపి పెద్దలు దాదాపు జనసేన టిడిపి కూటమితో కలిసి రాకపోవచ్చు అని పక్ష నాయకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి వామపక్షాలు ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వామపక్షాల ప్రభావం ఏ మాత్రం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఒకటో రెండో సీట్లు తీసుకొని కనీసం తమ ఉనికిని చాటుకునేందుకు వారు ఎక్కువగా అర్హత పడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కీలకం కానుంది.