వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తులతో వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టుపై,జనసేన అధినేత ప్రకటించిన పొత్తు విషయంపై రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైయస్ఆర్ కాపు
నేస్తం నాలుగో విడత నిధులు విడుదల సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై, టిడిపి జనసేన పొత్తులపై ఘాటు విమర్శలు చేశారు.
టిడిపి హయంలో చంద్రబాబు ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి ప్రభుత్వ నిధులును పక్కదారి పట్టించారనిఆరోపించారు. చంద్రబాబు దొంగగా దొరికినా కూడా అడ్డంగా బుకాయిస్తున్నారని, నల్లధనం ఇస్తూ అడ్డంగా ఆడియో వీడియో టేపులతో దొరికినా కూడా ఆ వాయిస్ చంద్రబాబు అని తేల్చినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ అర్థమైనా కూడా బాబు చేసింది నేరమే కాదన్నట్టుగా కొంతమంది వ్యవహరించడం బాధాకరంగా ఉందన్నారు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు 10 కోట్ల మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి అరడజను పచ్చ మీడియా ఛానల్లు రెండు పత్రికలు అండగా నిలిచాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్ల డబ్బు ఇస్తూ దొరికిన, ఫారెన్సీక్ ల్యాబ్లు సర్టిఫికెట్లు ఇచ్చిన, నీతి న్యాయం ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలి… ఎల్లో మీడియా నిజాన్ని చూపించరు, నోరు ఎత్తరు పైగా నిస్సిగ్గుగా బాబు చేసిన పని సబబే అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న కొన్ని దుష్టశక్తులతో మీ బిడ్డ పోరాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 100 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయిందని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును కానీ మరెవరిని అరెస్టు చేసిన ఇతర పార్టీ నాయకులు నోరు ఎత్తటం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవస్థలోనా మనం బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు అవినీతిలో వాటాలు పంచుకున్నారు కాబట్టి ఎవరు నోరు మెదపడం లేదని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచేసిన వారిని జైల్లో కాకపోతే మరి ఎక్కడ పెట్టాలంటూ జగన్ ప్రశ్నించారు. ములాఖత్ ముసుగులో మీలాకత్ అయ్యి పొత్తు పెట్టుకున్నారని, ఒక అవినీతిపరుడుకి ఒక దత్తపుత్రుడు సపోర్ట్ ఇస్తున్నాడని పవన్ కళ్యాణ్ పై జగన్ ఆరోపణలు చేశారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాను అన్న పవన్ కళ్యాణ్ కు ఈ అవినీతి కనిపించదా అని ప్రశ్నించారు. నేను నమ్మేది మొదట ఆ దేవున్ని తర్వాత ప్రజల నేనని జగన్ అన్నారు. నావల్ల మీ కుటుంబానికి మీకు లబ్ధి చేకూరింది అని మీరు నమ్మితేనే నా వెంట రావాలని సీఎం జగన్ కోరారు. ప్రతిసారి చెప్పే విధంగానే దుష్టశక్తులతో మీ బిడ్డ ఒంటరిగా పోరాడుతున్నాడని ఆ పోరాటానికి మీ అండ నాకు కావాలంటూ ప్రజలను సీఎం జగన్ కోరారు.