జనసేన తెలుగుదేశం పార్టీల కలయిక లో వచ్చేది చాలా కష్టకాలం క్లిష్ట కాలం.. జగన్ తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధం. దానిలో భాగంగా ఇప్పటివరకు కలవరు అని భావిస్తున్న జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కచ్చితంగా ఉంటుంది అని కుండబద్దలు కొట్టినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో జగన్ తన సోషల్ మీడియా సైన్యాన్ని వెంటనే రంగంలోకి దింపాడు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల వచ్చే సింపతిని దూరం చేయడానికి అలాగే ఆ కూటమికి పడే ఓట్లను పక్కదారి పట్టించడానికి అప్పుడే జనసేన తెలుగుదేశం పార్టీల మీద రకరకాలుగా వైసిపి సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది.
జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి వచ్చే ఐదు నెలల సమయం చాలా కీలకం. రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేయడంతో పాటు నేతలు, కార్యకర్తలు మంచి వాతావరణం ఏర్పడడానికి ఈ కాలం ఉపయోగించుకోవాలి. దీనిని ఎప్పటికప్పుడు విడదీసేందుకు రెండు పార్టీల మధ్య చిచ్చు రేపేందుకు వైసిపి సోషల్ మీడియా విభాగం కాచుకుని కూర్చుంది అన్న విషయాన్ని రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. రెండు పార్టీల నాయకుల్లోనూ ఒకరి నాయకుల్ని మరొకరు కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం లేదా పోస్టర్లు డిజైన్లు ఇతరత్రా వ్యవహారాలను చాలా కీలకంగా అధికారికంగా ప్రకటించుకునేందుకు ఓ విభాగాన్ని సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియా విభాగం నడుస్తోంది కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టు అవతారం ఎత్తుతారు. ప్రతి ఒక్కరూ ఇష్టానుసారం పోస్టులను వేస్తారు. ఏది నిజం ఏది అబద్దం అని నిర్ధారించి చెప్పేందుకు రెండు పార్టీల తరఫున ఒక కీలకమైన విభాగం పని చేస్తేనే ఖచ్చితంగా ఎన్నికల వరకు కార్యకర్తలను సమన్వయం చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వైసిపి కార్యకర్తలు సానుభూతిపరులు రకరకాల పోస్టులను స్ప్రెడ్ చేస్తూ అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెండు పార్టీల కార్యకర్తలను ఒక రకమైన భావజాలం సృష్టించి అయోమయపరిచి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుచుకోవాలని వైసిపి ప్రయత్నిస్తోంది. దీనిని ముందుగా గుర్తించాలి అంటే రెండు పార్టీలకు సంబంధించి ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి సోషల్ మీడియా పోస్టులను అలాగే ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే పద్ధతిని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారికంగా వచ్చే ప్రకటనలు అలాగే ప్రచారాన్ని మాత్రమే నమ్మాలి అని కింది స్థాయి కార్యకర్తల వరకు తీసుకువెళ్తేనే బాగుంటుంది. ఇప్పటికే వైసిపి సోషల్ మీడియా విభాగం 3,000 మంది ఉద్యోగులతో చాలా బలంగా ఉంది. దీనిని ఎదుర్కోవాలి అంటే రెండు పార్టీలు సోషల్ మీడియాని పటిష్టం చేయడంతో పాటు తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడితేనే బాగుంటుంది. వచ్చే ఎన్నికలను కచ్చితంగా సోషల్ మీడియా ప్రభావితం చేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తప్పుడు ప్రచారాలను చిత్రాలను వీడియోలను రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు ఏమాత్రం విశ్వసించకుండా ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తేనే మేలు జరుగుతుంది.