రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొత్త మలుపులు తీసుకునేలా కనిపిస్తున్నాయి. అరెస్టు తరువాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునకు జనసేన పార్టీ వేగంగా స్పందించింది. బందుకు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం బందుకు దూరంగా ఉండడం కనీసం చంద్రబాబు అరెస్టు పట్ల సంఘీభావం కూడా తెలపకపోవడం విశేషం. దీంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు అలాగే పొత్తుల రాజకీయాలు మారేలా కనిపిస్తున్నాయి.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకి ఓట్లను చీల్చనివ్వము అని మాటకు కట్టుబడి రాజకీయాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పలుమార్లు చర్చలు జరిపారు. దూరం జరిగిన తెలుగుదేశం పార్టీ బిజెపిని కలపడానికి పవన్ తన వంతు ప్రయత్నం చేశారు. జగన్ ను ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా పొత్తులు అవసరం అనేలా ఆయన కీలకంగా చర్చలు కూడా చేశారు. అయితే మొదటి నుంచి చంద్రబాబును పూర్తిగా నమ్మని బిజెపి పెద్దలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలవకుండా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే మంచిది అని పవన్ కు చెప్పి చూసిన ఆయన తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుకు మద్దతు తెలపడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బందులో పాల్గొనడం ద్వారా జనసేన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతుంది అని పూర్తిస్థాయి స్పష్టత వచ్చినట్లే అయింది. అయితే అదే సమయంలో బిజెపి దీని పట్ల స్పందించకపోవడం అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోకపోవడం చూస్తుంటే బిజెపి ఈ పొత్తులో కలిసి నడిచే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో మారే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బిజెపి వ్యవహార శైలి మారుతుందని అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో లోకేష్ అరెస్టు కూడా జరిగితే బిజెపి తీసుకోబోయే కీలకమైన స్టెప్స్ ఏంటి అనేది ఉత్కంఠను రేపుతోంది.