వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులను కూడా బలమైన వారిని రంగంలోకి దింపాలని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారీగా ఎవరిని రంగంలోకి దింపాలి అన్న నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన దాదాపు ఎంపీలందరూ ప్రజలకు అంత సుపరిచితులు కాదు. 2019 ఎన్నికల్లో దాదాపు వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో చాలామందిని అప్పటికప్పుడు పట్టుకొచ్చి ఎంపీ టికెట్లు ఇచ్చి మరి వైసీపీ గెలిపించుకోగలిగింది. ఐతే వచ్చే ఎన్నికల్లో ఈ పద్ధతి సరిపోదని భావిస్తున్నారు. దీంతో ప్రజలతో దగ్గర సంబంధాలు ఉన్న వారిని ఎంపీ అభ్యర్థులుగా పంపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
ఎంపీ అభ్యర్థులుగా ఈసారి ఇప్పటికే కొందరినీ ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన చాలామంది ఈసారి ఎంపీ అభ్యర్థిగా వెళ్లే అవకాశం ఉంది. దీంతోపాటు ఆర్థికంగా బలవంతులను సైతం ఆయన నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టుకున్నారు. ఈసారి దాదాపు ఎంపీ అభ్యర్థుల్లో చాలా వరకు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులకు సైతం ఎంపీ అభ్యర్థులుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవలసి ఉంటుందని సమాచారం ఇచ్చారు. దానికి సంసిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కర్నూల్, నంద్యాల, అనంతపురం, హిందూపురం సీట్లకు సంబంధించి కచ్చితంగా కొత్త అభ్యర్థులు రానున్నారు. కడప నుంచి మళ్లీ అవినాష్ రెడ్డిని బరిలోకి దింపే ఆలోచన ఉంది. అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయవచ్చు. రాజమండ్రి కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మార్గాన్ని భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినప్పటికీ అధిష్టానం సూచనల మేరకు మరోసారి ఎంపీగానే బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దాదాపు అన్ని సీట్లలను కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కొత్తవారిని రంగంలోకి దింపే సీట్ల విషయంలో వైయస్ జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజలతో పూర్తిస్థాయి సంబంధాలు ఉండి అందరి నేతలతో మంచిగా ఉండే వారిని మాత్రమే ఎంపీ అభ్యర్థులుగా పంపాలని భావిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అభ్యర్థులకు మధ్య పూర్తిస్థాయి సమన్వయం కలిగితేనే వచ్చే ఎన్నికల్లో అనుకున్న మేరకు సీట్లు సాధించగలమని జగన్ భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారికి ఎక్కడ సర్దుబాటు చేయాలి.. వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అన్న విషయం కూడా త్వరలోనే తేలనుంది.