టిడిపి మేనిఫెస్టో వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అన్నది వచ్చే ఎన్నికల ఫలితాలను కూడా నిర్దేశించే అవకాశం ఉంది. ఇప్పటికే టిడిపి మినీ మేనిఫెస్టోకు జనాల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో పాటు ప్రతికూలమైన స్పందనలు ఎదురు కావడంతో వచ్చే పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న అంశాన్ని టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండిన మేనిఫెస్టో గనుక పెడితే దాన్ని జనం నమ్ముతారా నమ్మరా అనేది అర్థం కాని విషయం గా మారింది. ఒకవేళ జనసేన పార్టీతో పొత్తుతో గనుక వెళితే ఉమ్మడి మేనిఫెస్టో విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఒకపక్క లోకేష్ మరో పక్క పవన్ కళ్యాణ్ ఇంకొక పక్కా చంద్రబాబు వేర్వేరుగా హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడ ఉమ్మడి మేనిఫెస్టో ఊసు ఇప్పటివరకు లేకపోవడం విశేషం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తుల మీద వెళ్తారు అని భావిస్తున్న టిడిపి జనసేన కచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజా రంజికంగా మారిస్తే తప్ప ప్రజలను ఓట్లు ధైర్యంగా అడిగినందుకు నాయకులు ముందుకు రాలేరు. కేవలం టిడిపి మినీ మేనిఫెస్టోలో చెప్పినట్లు సంక్షేమ పథకాలకు మాత్రమే మేనిఫెస్టో పరిమితం అయితే జగన్ కు అది అనుకూలమైన ఫలితాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలతో పాటు కొత్త కొత్త కార్యక్రమాలను తీసుకువస్తేనే మేనిఫెస్టోను నమ్మే అవకాశం కనిపిస్తోంది. మేనిఫెస్టోలో 99% వరకు అన్ని హామీలను అమలు చేశాం అని చెబుతున్న వైసిపిని దీటుగా ఎదుర్కోవాలి అంటే, వారు చేయలేనివి అలాగే ప్రజలకు అవసరమైనవి గుర్తించి ముందుకు సాగితేనే మంచి ఫలితం వస్తుంది.
మేనిఫెస్టో తయారీ అలాగే కొన్ని కొత్త కార్యక్రమాల అమలు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ఇటీవల ఆగస్టు 15 సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో సైతం నల్లధనం వెలిగితేతకు గతంలో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు అలాంటి ప్రోత్సాహకాలు వచ్చే ప్రభుత్వంలో ఇస్తామని చెప్పడం ద్వారా కొత్త ఆలోచనకు ఆయన బీజం వేశారు. అలాగే ప్రజా కోర్టు నిర్వహణ వంటి కొత్త కొత్త అంశాలను ఆయన తెరమీదకి తెస్తున్నారు. ఇవి ఖచ్చితంగా ప్రజల్లో ఆసక్తి పెంచేవి. దీంతోపాటు కేవలం సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న సంకేతం దీని ద్వారా ఇచ్చినట్లు అవుతుంది. ఇలాంటి ఉమ్మడి కార్యక్రమాలు రెండు పార్టీలు కలిపి చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాకాకుండా ఎవరి దారి వారిది అన్నట్టు మ్యానిఫెస్టోలను హామీలను ఇచ్చేస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఏ హామీ మీద ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది తేలదు. ఇది కచ్చితంగా ప్రజలను గందరగోళంలో పడేస్తుంది.