ఢిల్లీలో ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల సందర్భంగా జరిగిన రాజకీయాలు నారా కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని మళ్లీ దగ్గరకు చేస్తాయా… ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు కీలకం. ఉప్పు నిప్పులా ఉండే దగ్గుబాటి వెంకటేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా కలవడం ఒక ఎత్తు అయితే వారధిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యవహరించడం విశేషం. ఇది కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే కలయిక అన్నది రాజకీయ నిపుణుల మాట.
మొదటినుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనతోనే తమ పొత్తు ఉంటుంది అని చెప్పుకు వస్తున్న బిజెపి కి వచ్చే ఎన్నికల్లో టిడిపిని కలుపుకు వెళ్లడం మొదటి నుంచి ఇష్టం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన వాళ్ళ లాభం ఉంటుంది కానీ బీజేపీ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అన్నది చంద్రబాబు మనసులోని మాట. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బిజెపి లేకుండా టిడిపి తో జతకట్టడం, బిజెపి పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కచ్చితంగా భయపడుతున్నారు. దీంతో జనసేన అధినేత సైతం బీజేపీ టిడిపిలను కలిపేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే కచ్చితంగా మూడు పక్షాలు కలవాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే దీనిపై పలుమార్లు చెప్పినప్పటికీ బిజెపి పెద్దలు చంద్రబాబుతో కలవడం వల్ల భవిష్యత్తులో కొత్త కష్టాలు వస్తాయని పవన్ కళ్యాణ్ కు చెప్పినప్పటికీ జగన్ లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలి అంటే కచ్చితంగా మూడు పక్షాలు కలవడం కచ్చితం అని ఢిల్లీ పెద్దలకు చెప్పుకొచ్చారు. దీంతో మెల్లమెల్లగా ఢిల్లీ పెద్దల వైఖరిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వైఖరి కచ్చితంగా డిసెంబర్ నాటికి ఒక స్పష్టత వచ్చి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ముగ్గురు కలిపి సంయుక్తంగా ఒక కూటమి ఏర్పరిచి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీనికి మొదటి అడుగుగా ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం వేదికగా నిలిచిందని భావించవచ్చు. నందమూరి కుటుంబం నారా కుటుంబంలో కీలకమైన నాయకులుగా ఒక వెలుగు వెలిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడు చాలా ఏళ్ల తర్వాత కలిశారు. పురందేశ్వరికి రాష్ట్ర బిజెపి పగ్గాలు అప్పగించిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబుతో కలవడం ఇదే ప్రధమం. అది కూడా జాతీయాధ్యక్షుడు సమక్షంలో కలిసిన ఈ కలయిక ద్వారా రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్లు భవిష్యత్ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అన్న అంశం మీద కూడా కొన్ని విషయాలు మీద కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జేపీ నడ్డాతో చంద్రబాబు చాలా క్లోజ్ గా ఉన్న చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. దీంతో కచ్చితంగా ఈ వేదిక వచ్చే భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అధికారిక పొత్తు ఎప్పుడు ఉంటుంది దానిని ఎప్పుడు బయటపెడతారు ఒత్తులో కీలకమైన అంశాలు ఏమైనా ఉంటాయా అన్నది మాత్రం వేచి చూడాలి.