ఉత్తరాంధ్రలో చక్రం తెప్పిన బొత్స కుటుంబం నుంచి కొత్త తరం నేతను కచ్చితంగా ప్రమోట్ చేయాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్గా పని చేస్తున్న చిన్న శ్రీను ను బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. బొత్స రాజకీయ వారసుడిగా చిన్న శ్రీను ఇప్పటికే విజయనగరం రాజకీయాల్లో తలపండి పోయారు. బొత్స రాజకీయ వ్యవహారాలన్నీ చిన్న శ్రీను చక్కపెడతారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చిన్న శ్రీనుకు ప్రాధాన్యం ఇచ్చి బొత్స సత్యనారాయణ ను విజయనగరం ఎంపీగా పంపాలి అని వైసిపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విజయనగరం రాజకీయాలు వేడి మీద కనిపిస్తున్నాయి.
మొత్తం చిన్న శ్రీనుదే రాజ్యం
బొత్స సత్యనారాయణ సొంత అల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు. దశాబ్ద కాలంగా బొత్స సత్యనారాయణ రాజకీయ వ్యవహారాలు వ్యాపార కార్యకలాపాలు అన్ని చిన్న శ్రీను కనుసన్నలోనే జరుగుతాయి. కాంట్రాక్టర్ గా మారి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైతం ఈ మధ్యకాలంలో చిన్న శ్రీను చేశారు. జిల్లాను ప్రభావితం చేయగల నాయకుడు. అలాగే ఆర్థిక వ్యవహారాలు ఇతర వ్యవహారాలను కూడా చక్కబెట్టగల సమర్థుడు. అందరికీ సుపరిచితం అయిన చిన్న శ్రీను భవిష్యత్తు రాజకీయాలకు కూడా తమకు సరిపోతారని భావించి వచ్చే ఎన్నికల్లో చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా పూర్తి రాజకీయాలు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేస్తున్న చిన్న శ్రీనును రాజీనామా చేయించి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలపలని భావిస్తున్నారు. చీపురుపల్లి లేదా ఎస్ కోట నియోజకవర్గం నుంచి చిన్న శ్రీనును బరిలోకి దింపే ఆలోచన వైసీపీ పెద్దలు చేస్తున్నారు. కచ్చితంగా ఇది పార్టీకి ఉపయోగపడుతుందని, బొత్స సత్యనారాయణ కంటే బలంగా చిన్న శ్రీను నిలబడతారని వైసీపీ భావిస్తోంది. దీనిపై ఎప్పటికి చిన్న శ్రీనుతో వైసిపి పెద్దలు మాట్లాడినట్లు తెలుస్తోంది. చిన్న శ్రీను కొన్ని రోజులు తర్వాత తన నిర్ణయాన్ని చెబుతానని చెప్పడంతో ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.