వైసీపీ మెల్లమెల్లగా ఎన్నికల రంగంలోకి దిగుతోంది. ఒకేసారి అభ్యర్థుల ప్రకటన కాకుండా వైసిపికి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇప్పుడు పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వైసీపీలో సరికొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇటీవల విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన సజ్జల వచ్చే ఎన్నికల్లో విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు ఎవరు అధికార పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తారో చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినట్లుగా పశ్చిమ నుంచి వెల్లంపల్లి అలాగే సెంట్రల్ నుంచి మల్లాది విష్ణువులతో పాటు తూర్పు నుంచి ఈసారి దేవినేని అవినాష్ బరిలో నిలుస్తారని చెప్పారు. దీంతో కీలకమైన అత్యంత ముఖ్యమైన విజయవాడ నగరంలో అధికార పార్టీ అభ్యర్థుల ముగ్గురు ఖరారు అయినట్లే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సజ్జల చెబితే దాదాపు జగన్ చెప్పినట్లేనని ప్రస్తుతం వైసీపీలో ట్రైన్ నడుస్తున్న వేళ సజ్జల ఇలా ఒక్కొక్కరిగా పేర్లు బయట పెట్టడం వైసిపి వ్యూహంలో భాగమే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
మిగిలిన ప్రాంతాల్లో ఇదే పద్ధతి
సజ్జల రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఇదే తీరును ప్రదర్శిస్తారా అన్నది ఇప్పుడు చర్చినీయాంశం అవుతుంది. దీంతో సజ్జల వెళ్లే కార్యక్రమాలను కవర్ చేసేందుకు అలాగే అక్కడ ఆయన చెప్పే మాటలు ప్రత్యేకంగా వేసుకునేందుకు మీడియా ఛానల్లు పోటీ పడుతున్నాయి. అభ్యర్థులను ఒకేసారి ప్రకటించకుండా ఒక పద్ధతి ప్రకారం ఇలా ప్రకటిస్తేనే మంచిది అన్న కోణంలోనే అధికార పార్టీ ఈ ముందడుగు వేసినట్లు ముఖ్యమంత్రి అనుమతితోనే సజ్జల ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది మాత్రం విపక్షాలకు ఒక బూస్ట్ గానే చెప్పాలి. విజయవాడ నగరం పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అధికారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మొత్తం విజయవాడలోని మూడు నియోజకవర్గాలు క్లీన్ స్వైప్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నది విపక్ష పార్టీల మాట. విజయవాడలోని ముగ్గురు అభ్యర్థుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మళ్లీ వారికే టికెట్లు కేటాయిస్తామని అధికార పార్టీ చెప్పడం విపక్షాలకు మాత్రం బూస్ట్ ఇచ్చేలా ఉంది అని తెలుస్తోంది. అయితే విపక్ష పార్టీల నుంచి మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఖరారు కాలేదు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే అభ్యర్థులు పూర్తిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. పొత్తు ఖరారు అయిన తర్వాత మాత్రమే అసలు అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది