విశాఖను పూర్తిస్థాయి పరిపాలన రాజధానిగా చేసుకొని పాలించడానికి జగన్ పావులు కదుపుతున్న వేళ విశాఖపట్నం రాజధానిగా కావాలా వద్ద అన్న అంశం క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్నంగా ఉంది. ఇప్పటికే వైసీపీ నాయకుడి పరిపాలన మీద విశాఖపట్నం ప్రజలు భిన్నమైన స్పందనలో ఉన్న తరుణంలో విశాఖ వేదికగా రాజధాని చేస్తే విశాఖలో మరింత వ్యతిరేకతను వైసీపీ మూటకట్టుకోవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖ కావడానికి ఎక్కువ మంది మెజారిటీ వైజాగ్ ప్రజలు అంతగా సుముఖత చూపుతున్నట్లు అయితే క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అధికార గణం పరిపాలన గణం అంతా విశాఖకు వస్తే కొత్త సమస్యలు వస్తాయని సగటు వైజాగ్ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా ఉందని, ఇప్పుడు పరిపాలన రాజధానిగా మారడం వల్ల విశాఖకు కలిసి వచ్చే పెద్ద ప్రయోజనాలు ఏమీ ఉండవు అన్నది సగటు విశాఖపట్నం ప్రజల మాట.
పవన్ కు మద్దతుగా
ప్రస్తుతం వారాహి విజయ యాత్రను విశాఖలో నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విశాఖపట్నం ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు విశాఖపట్నం ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా పరిపాలన రాజధానిగా విశాఖను మారిస్తే విశాఖలో ఎంతటి విధ్వంసం జరుగుతుంది అన్న విషయాన్ని ప్రజలకు తెలియపరిచేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అక్టోబర్లో విశాఖపట్నం మాకం మార్చేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను విశాఖపట్నం వేదికగా పరిపాలన చేస్తూనే ఎదుర్కోవాలి అన్నది జగన్ ప్లాన్. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ వచ్చి మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక విశాఖపట్నం నుంచే ఆయన పరిపాలన సాగించనున్నారు. దీంతో కచ్చితంగా దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. విశాఖపట్నం వేదికగా వైసీపీ పాలన చేస్తే రౌడీ రాజ్యం అలాగే శాంతిభద్రతల వైఫల్యం పూర్తిగా ఉంటుందని ఇప్పటికే విశాఖపట్నం అత్యంత దారుణంగా తయారైందని ఆయన పదే పదే చెబుతున్నారు. దీంతో విశాఖపట్నం వేదికగా వచ్చే ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి.