రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై వైసిపి కీలక నేత సంచల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చను రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు దానిపై క్లారిటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సజ్జన నిన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు సజ్జల ఎక్కడ మాట్లాడినా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసిపి ప్రభుత్వానికి లేదని చెప్పుకొస్తే నిన్న మాత్రం ఆయన వాయిస్ కొంచెం మారినట్లు అనిపించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైసీపీ సిద్ధంగా ఉంటుందని చెప్పడం ద్వారా ఆయన ఒక సంకేతాన్ని శ్రేణులకు పంపినట్లు అర్థం అవుతుంది.
సన్నద్ధం అవుతున్న పార్టీలు
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ముందస్తు ఎన్నికలకు కచ్చితంగా వైసీపీ వెళుతుందని భావించే రాజకీయ వ్యూహాలకు పదులను పెడుతున్నారు. విపక్ష పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్దామని వైసిపి భావించినప్పటికీ అది ముందుగానే బయటపడింది. దీంతో ఆయా పార్టీలు వైసీపీ కంటే ముందుగానే ఎన్నికల ప్రణాళికతో రంగంలోకి దిగాయి. దీంతో జగన్ మళ్ళీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సాధారణ సమయానికి ఎన్నికలకు వెళ్దామని బలంగా ప్రచారం చేయాలని చెప్పినప్పటికీ విపక్ష పార్టీలు మాత్రం అంతకంటే ముందుగానే ఉండడంతో వైసీపీ మళ్ళీ తన పంథా మార్చుకుంది. ముందస్తు వస్తే మళ్లీ వెనక పడతామని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. శ్రేణులను కూడా సన్నద్ధం చేసే పనిలో భాగంగానే ముందుగానే సజ్జల హింట్ ఇచ్చినట్లు అర్ధం అవుతోంది. ఇప్పటికే ఇంటర్నల్ సమావేశాల్లో ముందస్తుకు రెడీగా ఉండాలని వైసీపీ శ్రేణులకు చెబుతున్న నేతలు ఇక ఎన్నికలు ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉందని చెప్పే అవకాశం ఉంది.