జగన్ ప్రతిపక్ష నాయకుడిగా చేసిన పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలను ప్రతి ఏట జనవరి 1న జాబ్ కాలండర్ ద్వారా భర్తీ చేస్తానని రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేశారని భీమవరం టీడీపీ మహిళా నేత సీతారామ లక్ష్మి విమర్శించారు.ఈరోజు జిల్లా టిడిపి కార్యాలయం నుండి విడుదలచేసిన పత్రిక ప్రకటనలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉపాధి ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పడం వాస్తవం కాదా అన్నారు. సి.ఎం.ఐ.ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రియల్ నాటికి 4.0 శాతం ఉన్న నిరుద్యోగిత శాతం డిసెంబర్ 22 నాటికి 7.7 శాతం పెరిగిందని చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మంది ఉద్యోగాలు కల్పించారని వైసీపీ మంత్రి అసెంబ్లీలో వెల్లడించారన్నారు. జగన్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తితో మూడున్నర ఏళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పోరుగు రాష్ట్రాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారని ఆవేదన చెందారు.రాజధాని అమరావతి నిర్మాణంతో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు శ్రీకారం చుడితే జగన్ అమరావతిని నిర్వీరం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల ఉద్యోగాలు ఇచ్చారని ప్రతి ఏట మెగా డీఎస్సీ నిర్వహిస్తానని జగన్ ఒక్క టీజర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ఐటీ అభివృద్ధితో 30 వేల ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 64,000 మందికి ఉద్యోగాలు టిడిపి హయాంలో ఇవ్వగా జగన్ రెడ్డి ఐటీ కంపెనీలను తరిమేసి అక్రమ కేసులతో స్కిల్ డెవలప్మెంట్ ను అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతినెల 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు 2000 చొప్పున నిరుద్యోగ భృతి ముఖ్యమంత్రి యువ నేస్తం ద్వారా ఇవ్వగా జగన్ దాన్ని రద్దు చేశారని జగన్ పాలలో గంజాయి అక్రమ రవాణా ఏపీలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేని రాష్ట్ర యువత గంజాయి డ్రగ్స్ మద్యం వంటి వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.