నిన్న మొన్నటి వరకు రకరకాల ఆరోపణలతో వ్యక్తిగత విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన వైసీపీ నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కు బిజెపి కేంద్ర నాయకత్వం వచ్చే ఎన్నికల్లో రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రి పదవి ఇవ్వనుందని, రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని వైసీపీ సానుభూతిపరులు భారీగా ప్రచారం చేస్తున్నారు. జనసేన బిజెపి కూటమిలో కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పురందేశ్వరి ఉండే అవకాశం ఉందంటూ పలు ఛానల్లోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పురందేశ్వరి విశాఖ పట్నంలో మీడియా సమావేశం అనంతరం ఈ ప్రచారం మరింత ఊపందుతుంది.
అది సాధ్యం అవుంతుందా?
జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీగా తన ప్రస్థానాన్ని 2014లో ప్రారంభించిన దగ్గర్నుంచి రాజకీయ అంశాలలో తన స్టాండ్ మార్చుకుంటూ వెళ్ళింది. అప్పటి పరిస్థితులను బట్టి వివిధ పార్టీలతో పొత్తులో కొనసాగింది. 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండడం ద్వారా తన బలాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల్లో సైతం రెండు చోట్ల ఓడిపోవడం ద్వారా కేవలం సినీ ఇమేజ్ తన రాజకీయ ప్రయాణానికి ఏమాత్రం దోహదం చేయదని బలంగా భావించారు. 2019 ఎన్నికల దగ్గర నుంచి రాజకీయంగా క్రియాశీలక అడుగులు వేశారు. ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించి ఆయా ప్రాంతాల్లో తన బలాన్ని బేరీజు వేసుకొని ముందుకు కదిలారు. ఇప్పటికిప్పుడే సీఎం అయిపోవడం సాధ్యం కాదు అని పవన్ కి ముందే తెలుసు. ఈ ప్రయాణంలో రాజకీయం తప్ప హీరోఇజం, సినిమా తనకు ఏమాత్రం ఉపయోగపడమని బలంగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కీలకమైన బలమైన శక్తిగా పార్టీని ఎదిగేందుకు తయారు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తనకు బలం ఉన్నచోట ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పూర్తిస్థాయి దృష్టి నిలిపి, వచ్చే ఎన్నికల్లో సన్నద్ధం అవుతున్న తరుణంలో కచ్చితంగా ఆయన టార్గెట్ ముఖ్య మంత్రి పదవి అని బలంగా చెప్పొచ్చు. 2014 ఎన్నికల తర్వాత ఏదో ఒక రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ అనుకుంటే కచ్చితంగా రాజ్యసభకు పంపేవారు బిజెపి పెద్దలు. ఆ తర్వాత కనీసం కేంద్రంలో ఏదో ఒక ముఖ్య పదవిని తీసుకునే వెసులుబాటు ఉండేది. దానిని పూర్తిస్థాయిలో పక్కనపెట్టి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం కేంద్ర మంత్రి పదవి కోసం తన పార్టీని పూర్తిగా వదులుకునే ప్రసక్తి లేదు. గతంలో సైతం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రజారాజ్యం విలీనం తర్వాత ఆయనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా అందులోనూ కేంద్ర మంత్రి పదవి కోసం పార్టీని విలీనం చేశారు అన్న ఆ ప్రతిష్ట ఇంకా మాయకముందే మళ్లీ పవన్ కూడా కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు అనడం పూర్తిగా వైసీపీ మీడియా చేస్తున్న ప్రచారం గానీ భావించాలి. వచ్చే ఎన్నికల్లో బలమైన పోరాటం కోసం వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం బలమైన ప్రయత్నం చేస్తారే తప్ప మళ్ళీ పాత తప్పులను పునరావృతం చేసే అవకాశం లేదని చెప్పాలి.