కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ,కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతేరేకంగా సీఐటీయూ ఆధ్వర్యం లో చలో ఢిల్లీ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాల నుంచి వామపక్షాల నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు . రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5వ తేదీన లక్షలాది మందితో జరుగుతున్న కార్మిక, కర్షక ఐక్యత ర్యాలీలో పాల్గుననున్నారు . శనివారం తెల్లవారుజామున ఏపీ ఎక్ ప్రెస్ లో ఏలూరు నుంచి పయనం అయ్యారు కేంద్ర విధానాల పట్ల సీఐటీయూ నేత సోమయ్య ఆగ్రహ వ్యక్తం చేసారు .
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంపదనంతా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు దోచుకుంటున్నారని, దేశ ప్రజలపై ఎక్కువ పన్నులు మోపడంతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, నవరత్నాలుగా పేరొందిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు.లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు రక్షణగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కౌలు రైతులకు రక్షణ లేదన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని,రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు.కేంద్రం విధానాలతో రాజ్యాంగం పెను ప్రమాదంలో పడిందని, దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు.ఈ ప్రజావ్యతిరేక, మతోన్మాద, నియంతృత్వ భాజపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పకుంటే ఈ దేశ సంపద అంతా అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు.ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.