అకాల వర్షాలు వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వర్జీనియా పొగాకు, మొక్కజొన్న, మిర్చి, మామిడి, అరటి తదితర పంటలకు నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ధీమా.. ప్రధానమంత్రి ఫసల్ బీమా అని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసిందని ఆచరణలో పంటల బీమా పథకం రైతులకు అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు. పంటల బీమా పథకాలు వలన కార్పొరేట్ బీమా కంపెనీలు వేలకోట్ల రూపాయలు లాభాలు పొందుతున్నాయని, రైతులకు మాత్రం బీమా పరిహార అందడం లేదన్నారు. అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన అన్ని పంటలకు పంటల బీమా పథకం వర్తింపజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పంటలు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు ఎన్యుమరేషన్ చేసి ఇన్ ఫుట్స్ సబ్సిడీ అందించాలన్నారు. గోదావరి డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. రబీ ధాన్యం కొనుగోలుకు సమాయత్తం అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అయితే ధాన్యం కొనుగోళ్లలో వస్తున్న సమస్యలను రైతులు, రైతు సంఘాలతో చర్చించి ముందుగానే పరిష్కరించాలని కోరారు.